పర్యావరణ పరిరక్షణకు, కాలుష్య నియంత్రణకు..
మేయర్ ఆటోలో…కమిషనర్ సైకిల్ మార్గంలో!
నగర ప్రజల సహకరించాలని సూచన
96మీడియా,విశాఖపట్నం:- కాలుష్య నియంత్రణకు నగర ప్రజలంతా సహకరించాలని మేయర్ గొలగాని హరి వెంకట కుమరి, జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు. వారానికొక్కరోజైనా ప్రజలంతా తమ సొంత వాహనాలు వదిలి ప్రజా రావాణా వ్యవస్థను ఉపయోగించుకోవాలని కోరారు. జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు ప్రతి సోమవారం ‘నో వెహికల్ జోన్’ పాటిస్తున్నట్టు గుర్తు చేశారు. మేయర్ తన క్యాంపు కార్యాలయం నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు సోమవారం ఆటోలో ప్రయాణించి అందరికీ ఆదర్శంగా నిలిచారు. అనంతరం “జగనన్నకు చెబుదాం” మరి ఇతర కార్యక్రమాల్లో పాల్గొని ఆ తర్వాత ఇంటికి కూడా ఆటోలోనే చేరుకున్నారు.
సైకిల్ తో రోడ్డు మార్గాన జీవీఎంసీ కమిషనర్…
కాలుష్య నియంత్రణలో భాగంగా జీవీఎంసీ కమిషనర్ కూడా తన బంగ్లా నుంచి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు సైకిల్ తొక్కుతూ రోడ్డు మార్గాన్ని వెళ్లడం ఆందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఈ సందర్భంగా ఇరువురు మాట్లాడుతూ ముఖ్యంగా వాయు శబ్ద కాలుష్య నియంత్రణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు.