96మీడియా, విశాఖపట్నం:- విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమనను జాతీయ గీతంగా భారత రాజ్యాంగ సభ ఆమోదించి జనవరి 24కు 73 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ నిర్వహిస్తున్న జయహో జనగణమన వారోత్సవాలలో భాగంగా మొదటిరోజు చంద్రంపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 4000 విద్యార్థులతో 73 సార్లు జనగణమన గీతాలాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ వ్యస్థాపక అధ్యక్షులు రాజేటి బసవ కృష్ణ మూర్తి మాట్లాడుతూ విద్యార్థులలో జాతీయ సమైక్యతను, దేశభక్తిని పెంపొందించడమే లక్ష్యంగా తమ సంస్థ కృషి చేస్తుందని అన్నారు. 2012కి జనగణమనను మొదటిసారి ఆలపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా సన్, ఆంధ్రా యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సంయుక్తంగా పది వేల మంది విద్యార్థులతో శతవసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించామన్నారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎమ్. రాజబాబు మాట్లాడుతూ విద్యార్థులు జనగణమన గీతాలాపన చేయడం ద్వారా దేశభక్తి పెరుగుతుందని ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడంలో స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ కృషి అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు ఎ.జయప్రద, ఫిజికల్ డైరెక్టర్పి రాము, కె.శ్రీనివాస్,పి.దేవుడు బాబు, జి. ప్రకాష్, స్కూల్ కమిటీ మెంబర్ పి. సూరిబాబు, స్టూడెంట్స్ యునైటెడ్ నెట్వర్క్ క్రియాశీలక సభ్యులు కసిరెడ్డి రమేష్, కాకర సురేష్, ఆర్.ఎస్.ఎ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు బాలు పాత్రో, చిన్ని వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
73 సార్లు జనగణమన గీతాలాపన
Add to favorites 0