వైభవోపేతంగా పల్లకీ సేవ శోభాయాత్ర
అమ్మవారి నామస్మరణలతో ఘటాల ఊరేగింపు
ఘనంగా విజయదుర్గా దేవి సారె ఊరేగింపు
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనం
96మీడియా,మధురవాడ:- విశాఖలోని మధురవాడ సందడిగా మారింది. మధురవాడ ,టైలర్స్ కోలనీలో శ్రీ విజయదుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవాల సందర్బంగా గురువారం సాయంత్రం వైభవోపేతంగా పల్లకీ సేవ శోభాయాత్ర,ఘటాల ఊరేగింపులు కనుల పండువగా సాగాయి. ఆ ఘట్టాలను కనులారా వీక్షించిన భక్తులు తన్మయత్వం పొందారు. తల్లి.. చల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు.అమ్మా బైలెల్లినాదో .. తల్లి బైలెల్లినాదో.. అంటూ పాటల సందడి .. డప్పుల దరువు, కోలాటాల నృత్యాల మధ్య అమ్మవారి పల్లకీ సేవ శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగాయి . అమ్మవారు పల్లకీపై శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు,లక్ష్మీ దంపతుల ఆధ్వర్యంలో ప్రధానార్చకులు శ్రీకాంత్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా లలితా త్రిపుర సుందరీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించి వేద పండితుల మంత్రోశ్ఛరణలు, మంగళ వాయిధ్యాల మధ్య పురవీధుల్లో పల్లకీ సేవ,కలశ యాత్ర,సారె ఊరేగింపును నిర్వహించారు . అంగరంగ వైభవంగా బయలుదేరిన అమ్మవారి పల్లకీ సేవ చేయడానికి భక్తులు పోటీ పడ్డారు. మహిళలు అడుగడుగునా మంగళహారతులతో ఘన స్వాగతం పలికి కలశాలు ఎత్తుకొని పల్లకీ ఉత్సవం వెనుక అమ్మవారి నామస్మరణతో నడిచారు. కార్యక్రమానికి ముందుగా ఆలయ ధర్మకర్తలు బంగారు సుబ్బారావు లక్ష్మి దంపతులు దీపారాధన గావించి పల్లకీ సేవను ప్రారంభించారు . ఈ సందర్బంగా ధర్మకర్తలు మాట్లాడుతూ అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని మహోత్సవాలు నిర్వహిస్తున్నట్టు అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు బంగారు ప్రకాష్ ,తెంటు మాధవి,బంగారు అశోకు కుమార్ ,బంగారు ఝాన్సీ ,వట్టికుల నాగమ్మ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు