సంపద సృష్టి చంద్రబాబుకు తెలిస్తే… అప్పులు చేయడం జగన్ కు తెలుసు
ఉత్తరాంధ్ర ప్రజలు అమరావతి ఏకైక రాజధానిగా కోరుకుంటున్నారు
యువతకు ఉద్యోగాలు రావాలంటే మళ్ళీ చంద్రబాబు రావాల్సిందే
వచ్చే ఎన్నికలు వైసీపీకి అంతిమయాత్ర
—- చంద్రబాబుతో తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్
96మీడియా,విశాఖపట్నం: రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ వ్యాఖ్యానించారు. గురువారం ఉదయం మీనాక్షి కన్వెన్షన్స్, వేపగుంటలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిసిన అనంతరం బి.వి.రామ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో విసిగి వేసారి పోయారన్నారు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా మండు వేసవిలో కూడా మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రసంగం వినేందుకు వేల సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారన్నారు. ప్రభుత్వం మొండి పట్టుదలకు పోకుండా వ్యవహరిస్తే మేలని పేర్కొన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు తీసుకువచ్చిన జీవో నెంబర్ 1ని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానానికి చెంప పెట్టని అన్నారు.
చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తే వైయస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు చేస్తేనే గాని.. రోజులు గడిచే పరిస్థితి లేదన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అటు ఉద్యోగులతో పాటు నిరుద్యోగులు కూడా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై తీవ్ర ఆక్రోశంతో ఉన్నారన్నారు .
రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి ఉండాలని కోరుకుంటున్నారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తానే రాష్ట్రానికి 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. తానే శాశ్వతంగా ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఆంధ్రప్రదేశ్ ఏమీ ఆయన సొంత జాగీరు కాదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన వైఖరిని మార్చుకొని.. అధికారం మిగిలిన కొన్ని నెలలు అయినా ప్రజారంజకంగా పాలించాలని హితవు పలికారు. లేనిపక్షంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళాఖాతంలో కలపడం ఖాయమని జోస్యం చెప్పారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలలో అపార విశ్వాసం ఉందని, ఈ క్రమంలోనే రాబోయే ఎన్నికలలో 175 నియోజకవర్గాలకు 175 నియోజకవర్గాలలోనూ తెలుగుదేశం పార్టీ గెలుపు బావుటా ఎగురవేస్తుందన్నారు.
తెలుగుదేశం పార్టీ నాయకులు, విశాఖ పార్లమెంటు తెలుగు దేశం పార్టీ కమిటీ కార్యదర్శి బోడేపూడి దొరబాబుబ, బి.సి సెల్ నాయకులు దువ్వి పరమేశ్వరరావు, కమ్మ నరేంద్ర ప్రసాద్ చంద్రబాబు నాయుడు గారిని కలిసిన వారిలో ఉన్నారు.