96మీడియా, విశాఖపట్నం:-ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో అన్ని కులాలకు అన్ని వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని వైసిపి విశాఖ జిల్లా అధ్యక్షులు కోలా గురువులు అన్నారు.ఎండాడ,లా కాలేజీ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైసిపి అధికారంలోకి వచ్చాక అనేక మందికి గుర్తింపు తీసుకొచ్చి, ఉన్నత స్థానాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఇటువంటి కోవకే చెందిన సీతంరాజు సుధాకర్ కు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా తరువాత ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు. అంతటి అవకాశం కల్పించిన పార్టీని వదిలి వెళ్ళిపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎంతమంది బయటికి వెళ్లిపోయిన వైసీపీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుని మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. సుధాకర్ పార్టీలో ఉంటే భవిష్యత్తులో అనేక అవకాశాలు వచ్చి ఉండేవని, జగన్మోహన్ రెడ్డి ఆ విధంగా ఆయనకు గుర్తింపుని ఇచ్చారన్నారు. పార్టీ నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించారని, అందులో భాగంగానే సీతంరాజు సుధాకర్ కు మంచి హోదా ఇచ్చారని, అయితే ఆయన దానిని నిలబెట్టుకోకపోవడం బాధాకరమన్నారు. తన తండ్రి ద్రోణంరాజు శ్రీనివాస్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయినప్పటికీ, విఎంఆర్ డిఏ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించడం జగన్మోహన్ రెడ్డి ఔన్నత్యాన్ని నిరూపిస్తుందన్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరు పార్టీ నుంచి వెళ్లిపోయిన వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రజల హృదయాల్లో మరింత చేరువవుతారని చెప్పారు.
అన్ని కులాలకు,వర్గాలకు జగన్ ప్రాధాన్యత కల్పిస్తున్నారు : వైసిపి కోలా గురువులు
Add to favorites 0